అమరావతి : నేటి నుండి ‘ ఆడుదాం – ఆంధ్రా ‘ ఆటల పోటీలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు నిర్విరామంగా ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలను నిర్వహించనున్నారు. తొలి దశలో జనవరి 9వ తేదీ నాటికి గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలను పూర్తి చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 10 నుంచి 23 వరకు మండల స్థాయిలో, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 6వతేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి.
ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆటల పోటీలు ప్రారంభమవుతాయి.
పశ్చిమ గోదావరి : ఉండి మెయిన్ సెంటర్ నుండి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అధికారులు ర్యాలీ నిర్వహించారు. డిసిసిబి చైర్మన్ పివిఎల్ నరసింహారాజు, స్థానిక నాయకులు, వాలంటీర్లు ఉండి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణంలో ఉండి శశి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థినిలతో కబడ్డీ పోటీలు ప్రారంభించారు. డిసిసిబి చైర్మన్, ఉండి నియోజకవర్గ ఇన్చార్జ్ పివిఎల్ నరసింహారాజు మొదట ఆడి ఆటను ప్రారంభించారు. గణపవరంలో ‘ ఆడుదాం ఆంధ్ర ‘ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర నుండి డిగ్రీ కాలేజ్ వరకు అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసు బాబు, ఎంపీడీవో జ్యోతిర్మయి, పంచాయతీ డి ఎస్ ఆర్ ప్రసాద్, సర్పంచి మూర అలంకారం పాల్గొన్నారు.