ప్రజాశక్తి-హిందూపురం(శ్రీ సత్య సాయి జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమ్మెపై మొండి వైఖరి మానుకొని, తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన సమ్మె 6వ రోజుకు చేరింది. ఆదివారం అంగన్వాడీలు వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలోని ఇందిరా పార్క్ నుంచి అంగన్వాడీలు అందరూ పట్టణంలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ సర్కిల్ లో మానవహారంగా ఏర్పడి, గడ్డి తింటూ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీలు చేపట్టిన ర్యాలీకి వారి చిన్నారులు సైతం మద్దతు పలికి జగన్ మామ…. మా అమ్మలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి అంటుంది నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, తహసిల్దార్ కార్యాలయం ముందు వినూత్నంగా సోది చెబుతామమ్మ సోది అంటూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జగన్కు సోది చెప్పి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఉషారాణి, ప్రాజెక్టు కార్యదర్శి లావణ్య, నాయకులు శిరీష, శైలజ, నాగమ్మ, రిహానా, సుమియ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.