ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎఐటియుసి విజయం సాధించింది. సింగరేణి బొగ్గు గనులున్న మొత్తం 11 ఏరియాల్లో బుధవారం ఎన్నికలు జరగాయి. ఐదుచోట్ల ఎఐటియుసి, ఆరుచోట్ల ఐఎన్టియుసి ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి. మొత్తంగా ఐఎన్టియుసిపై 1,999 ఓట్ల ఆధిక్యంతో ఎఐటియుసి గెలుపొందింది. బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో ఎఐటియుసి విజయం సాధించింది. రామగుండం రీజియన్లోని రామగుండం-1, 2 ఏరియాల్లో ఎఐటియుసి, రామగుండం-3లో ఐఎన్టియుసి విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాల్లో ఐఎన్టియుసి గెలుపొందాయి. మొత్తం 39,773 ఓట్లకు గాను 37,468 ఓట్లు పోలయ్యాయి. 94.20 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఇల్లెందు ఏరియాలో 98.37 శాతం, అతి తక్కువగా శ్రీరాంపూర్, రామగుండం-3 ఏరియాల్లో 93 శాతం ఓట్లు పోలయ్యాయి. బుధవారం రాత్రి ఏడు గంటల నుంచి డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. అర్ధరాత్రి ఒంటిగంటకు అధికారులు ఫలితాలను వెల్లడించారు.