- తొలి దశలో 66.14%
- రెండో దశలో 66.71%
- పోలింగ్ జరిగిన 11 రోజులకు తొలి దశ వివరాలు
- ఆలస్యంపై వివరణ ఇవ్వని ఎన్నికల కమిషన్
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల తొలి దశలో 66.14%, రెండో దశలో 66.71% పోలింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పోలింగ్ జరిగిన 11 రోజుల తర్వాత తొలి దశ వివరాలను వెల్లడించడం గమనార్హం. తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న, రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 26న జరిగిన విషయం తెలిసిందే. తొలి దశలో బీహార్లో అత్యల్పంగా 49.26% ఓటింగ్ నమోదు కాగా, లక్షద్వీప్లో అత్యధికంగా 84.16% నమోదైంది. రెండో దశలో ఉత్తరప్రదేశ్లో అత్యల్పంగా 55.19%, మణిపూర్లో అత్యధికంగా 84.85% పోలింగ్ జరిగింది.
ప్రతి నియోజకవర్గంలోనూ పురుషులు, మహిళల ఓటింగ్ వివరాలను కూడా ఇసి విడుదల చేసింది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు ఎంత మంది, వారిలో ఎంత మంది ఓటేశారు అనే వివరాలను మాత్రం తెలుపలేదు. 2019లో ఎన్నికల కమిషన్ ఈ సమాచారాన్ని కూడా అందించింది. కమిషన్ వెబ్సైటులో ప్రతి లోక్సభ నియోజకవర్గంలోనూ ఎంత మంది ఓటర్లు ఉన్నారన్న వివరాలు లేవు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల సంఖ్య మాత్రం ఉంది. బీహార్, ఢిల్లీ, ఒడిషా రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు ఈ సమాచారం కూడా ఇవ్వలేదు.
గత లోక్సభ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ఎంత శాతం పోలింగ్ నమోదైంది, ప్రస్తుతం ఎంత పోలింగ్ జరిగింది అనే సమాచారం కూడా ఇసి వెబ్సైటులో కన్పించలేదు. తొలి దశ పోలింగ్ ముగిసిన 11 రోజుల తర్వాత ఓటింగ్ శాతాన్ని వెల్లడించడం అసాధారణమని పరిశీలకులు వ్యాఖ్యానించారు. ఈ జాప్యానికి కారణమేమిటో ఇసి వివరించలేదు. రెండో దశ పోలింగ్లో 66.71% ఓటింగ్ జరిగిందని ఇసి ప్రకటించినప్పటికీ ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రం ఏడు గంటలకు 60.96% పోలింగ్ జరిగిందని పత్రికా ప్రకటనలో తెలిపారు. ఓటింగ్లో ఆరు శాతం పెరుగుదల ఎందుకు వచ్చిందన్న దానిపై స్పష్టత లేదు. సుమారు ఆరు శాతం పెరుగుదల అంటే చిన్న విషయమేమీ కాదని, దీనిపై ఇసి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని పాత్రికేయుడు ఎంఎన్ పార్థ్ అభిప్రాయపడ్డారు.
రెండో దశ పోలింగ్ రోజు రాత్రి 8 గంటలకు పిటిఐ వార్తా సంస్థ ఇసిని ఉటంకిస్తూ ఓ వార్తను అందించింది. 63.5% పోలింగ్ జరిగిందని తెలిపింది. వాస్తవానికి ఇసికి ఓ యాప్ ఉంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంతమేర పోలింగ్ జరిగిందో ఎప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా సమాచారం అందుతుంది. అయినప్పటికీ ఓటింగ్ వివరాలు అందించ డంలో ఎందుకింత జాప్యం జరిగిందో తెలియడం లేదు.