ప్రజాశక్తి-గజపతినగరం : స్థానిక ఆర్టిసి కాంప్లెక్సు వద్ద పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో 95కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బొబ్బిలి డిఎస్పి పి.శ్రీధర్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ట్రైనీ డిఎస్పి ఎస్.మహేంద్ర ప్రస్తుతం గజపతినగరం ఎస్హెచ్ఒలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈనెల 18న ఆయనకు వచ్చిన సమాచారంతో ఆర్టిసి కాంప్లెక్సు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఒడిశా రాష్ట్రం పడువా నుండి కారులో గంజాయి తరలిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.1.90 లక్షల విలువైన 95 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సిఐ ఎన్.వి.ప్రభాకర్, ఎస్ఐ యు.మహేష్ పాల్గొన్నారు.