ఆటో-బస్సు ఢీకొని ముగ్గురి మృతి.. 9 మందికి గాయాలు

మోతె: సూర్యాపేట జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోతె సమీపంలో ఆటో, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం రామసముద్రానికి చెందిన 15 మంది కూలీలు మోతె మండలం బురకచెర్ల గ్రామానికి మిరపకోత పనుల కోసం ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు మోతె మండల కేంద్రం పరిధిలోని సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారి అండర్‌ పాస్‌ వంతెన వద్దకు రాగానే వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ప్రభుత్వాసుప్రతికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు మధిర డిపోనకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

➡️