పాకిస్థాన్‌ ఆర్మీ బేస్‌పై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి

Dec 12,2023 15:12 #Army Base, #Pakistan, #Suicide Bombing

పెషావర్‌  :   పాకిస్థాన్‌ ఆర్మీ బేస్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆఫ్ఘన్‌ సరిహద్దులోని ఖైబర్‌ ఫక్తుంక్వా ప్రావిన్స్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో 23 మంది మరణించిగా, మరో 27 మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌ తాలిబన్‌తో సంబంధం ఉన్న తెహ్రీక్‌-ఇ-జిహాద్‌ పాకిస్థాన్‌ ఈ దాడికి పాల్పడినట్లు వెల్లడించారు.

ఖైబర్‌ ఫక్తుంక్వా ప్రావిన్స్‌లోని డేరల్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌ జిల్లాలో పాఠశాల భవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సైనికస్థావరంపై పేలుడు పదార్థాలతో నిండి ఉన్న ఆత్మాహుతి వాహనం పేలినట్లు అధికారులు తెలిపారు. మూడు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయని, నిద్రలో ఉన్నవారంతా అలాగే మృత్యువాత పడ్డారని అన్నారు. శిథిలాల నుండి మృతదేహాలను బయటకు తీయాల్సి ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని చెప్పారు. వారంతా సాధారణ దుస్తులు ధరించి ఉండటంతో సైనికులా కాదా అనేది గుర్తించాల్సి ఉందని అన్నారు. ఈ ఘటనపై పాకిస్థాన్‌ ఆర్మీ స్పందించాల్సి వుంది.

➡️