జిఓ 81 విడుదల
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రతియేటా జూన్ 20న రెవెన్యూ దినోత్సవం (రెవెన్యూ డే) జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జిఓ ఎంఎస్ నెంబరు 81నివిడుదల చేసింది. రెవెన్యూశాఖలో ఉనుత సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులను ఆ రోజు సత్కరించుకోవడం కోసం రెవెన్యూ దినోత్సవాన్ని ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. రెవెన్యూ దినోత్సవాన్ని ఆ రోజు రాష్ట్రంలోని ప్రతి మండల, జిల్లా స్థాయిల్లో నిర్వహించాలని తెలిపింది. రెెవెన్యూశాఖ అందించే సేవలపై అవగాహన కల్పించాల్సి ఉంటుందని పేర్కొంది. రెవెన్యూ రికార్డులు, అడంగల్, 1-బి ప్రభుత్వ, దేవాదాయశాఖ, వక్ఫ్ భూముల వివరాలు డిస్ప్లే చేయడంతోపాటు సంబంధిత విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించింది. ఉద్యోగ విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులకు సన్మానం చేయడం, సెలక్షన్ కమిటీ ద్వారా తమ విధులు, సేవల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు కమెండేషన్ సర్టిఫికెట్ జారీ చేయాలని జిఓలో స్పష్టం చేసింది. తమ విజ్ఞప్తి మేరకు 1786లో రెవెన్యూశాఖ ఏర్పడిన జూన్ 20వ తేదీని రెవెన్యూ డేగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బప్పరాజు వెంకటేశ్వర్లు.. ప్రభుత్వానికి, సిఎం జగన్కు, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలిపారు.