మధ్యప్రదేశ్‌లో బస్సు-డంపర్‌ ఢీ.. 13 మంది మృతి

  • ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిఎం మోహన్‌ యాదవ్‌

మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, డంపర్‌ ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఎగసిపడి బస్సు పూర్తిగా దగ్ధమైంది. గుణ-ఆరోన్‌ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని, క్షతగాత్రులను చికిత్స కోసం గుణ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆరోన్‌కు వెళ్తున్న బస్సు, గుణ వైపు వస్తున్న డంపర్‌ రాత్రి 9 గంటల సమయంలో ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయని స్థానిక ఎస్పీ తెలిపారు. ఈ ఘోర ప్రమాదంపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై విచారణకు ఆయన ఆదేశించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. కాగా ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని గుణ జిల్లా కలెక్టర్‌ తరుణ్‌ రాఠీ వెల్లడించారు.

➡️