డిసెంబర్ 20న విజయవాడలో జరిగిన కాల్పుల్లో నాకు కుడి కాలు తొడలో బుల్లెట్ దూసుకుపోగా ఎముక విరిగింది. లాగుడు బండి నడిపే కార్మికుడు చిన్నాకు ఉదరభాగంలో బుల్లెట్ తగిలింది. గుర్రం గోవిందు ఛాతిభాగంలో బుల్లెట్ తగలడం వలన అక్కడికక్కడే మరణించాడు. నన్నూ, చిన్నాను మంచి వైద్యం కోసం ప్రజావైద్యశాలకు తీసుకువెళ్ళారు. ఆ రోజు రాత్రి పోలీసువాళ్లు ప్రజావైద్యశాలలో చికిత్స పొందుతున్న మమ్మల్ని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నించారు. దానికి సందరయ్యగారు అంగీకరించలేదు. డాక్టర్ భాస్కరరావుగారు, డాక్టర్ సుధాకర్గారు మాకు వైద్యం చేస్తున్నారు. మాకు మంచి వైద్యం అందజేయడానికి అవసరమైతే డాక్టర్ల మీద కేసులు పెట్టినా ఫర్వాలేదని, విరిగిన నా కాలును బాగు చేయించమనీ, చిన్నా ఉదరభాగంలో ఉన్న బుల్లెట్ను జాగ్రత్తగా తీయించమనీ సుందరయ్యగారు ఆదేశించారు. ఒంగోలు నుంచి వచ్చిన డాక్టర్ రంగారావుగారు చిన్నాకు వైద్యం చేసి అతనిని ప్రాణాపాయం నుండి కాపాడారు. ఆ రోజు ప్రజావైద్యశాలలో డాక్టర్లు చేసిన వైద్యంతో నా కాలు బాగుపడింది. ఈ సంఘటనలో సుందరయ్యగారు మా యెడల చూపిన శ్రద్ధాశక్తులు ఇప్పటికీ నా మదిలో మెదులుతూ ఉంటాయి. నాకు ఆపరేషన్ అయిన తరువాత సుందరయ్యగారు నా దగ్గరకు వచ్చి ... కాలేజీలో నీ అటెండెన్స్ తగ్గింది కదా. మరి ఎగ్జామినేషన్కు అనుమతి ఇప్పిస్తాను, సబ్జెక్టులన్నీ మంచం మీదే చదివి పాస్ అవ్వాలి. అప్పుడే మన ఎస్ఎఫ్ఐ విద్యార్థికీ, వేరొకరికీ తేడా తెలుస్తుంది అన్నారు. అన్ని సబ్జెక్టులూ పాసవ్వలేనండీ అన్నాను. కనీసం సగం సబ్జెక్టులయినా పాస్ అవ్వాలి. అంతేకాకుండా ఇంటర్మీడియెట్లో ఫస్ట్ క్లాస్లోగానీ, సెకండ్ క్లాస్లోగానీ పాసవ్వాలి అని చెప్పారు. ఆయన చెప్పినట్లు నేను ఇంటర్ సెకెండ్ క్లాస్లో పాసయ్యాను.
1981 డిసెంబర్లో సిపిఎం జాతీయ మహాసభల సందర్భంగా నేను సుందరయ్యగారి కార్యాలయంలో వలంటీర్గా ఉన్నాను. ఆరోజు మహా ప్రదర్శన. బహిరంగ సభ కృష్ణానది తీరంలో ఏర్పాటు చేశారు. సుందరయ్యగారి కార్యాలయం బయట ఉన్న నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. కాళ్ళకు చెప్పులు లేవు. నిక్కరు వేసుకొని ఉన్నాడు. భుజాన ఎర్రజెండాతో ఉన్న అతను వచ్చి సుందరయ్యను చూడాలని, కృష్ణాజిల్లా కోడూరు నుంచి నడిచి వచ్చానని, తనను లోనికి పంపించమని అడిగాడు. సుందరయ్యగారు చాలా బిజీగా ఉన్నారు కుదరదని చెబితే నాతో వాదనకు దిగాడు. అతను తన పేరు చెప్పి (నాకు పేరు గుర్తు లేదు) 'నేను వచ్చానని సుందరయ్యతో చెప్పు, ఆయనే వస్తాడు' అన్నాడు. పున్నారావుగారి సలహా మేరకు నేను ఆఫీసులోకి వెళ్ళి సుందరయ్యగారికి చెప్పాను. వెంటనే సుందరయ్యగారు బయటకు వచ్చి ఆ వ్యక్తిని పేరుతో పలకరించి కోడూరు నుంచి ఎందుకు నడిచి వచ్చావు. తిరిగి వెళ్ళేటప్పుడు ఏదైనా లారీలోగానీ, బస్సులోగానీ వెళ్ళు అని ఆదరంగా చెప్పారు. నిజంగా ఆ మాటలు మననం చేసుకుంటే సుందరయ్య 'ప్రజల మనిషి' అనే పదానికి అర్థం అనే మాట యదార్థం.