కాచిగూడ-తిమ్మాపూర్‌ మధ్య పట్టాలు తప్పిన గూడ్స్‌

  • పలు రైళ్లు దారి మళ్లింపు, కొన్ని పాక్షికంగా రద్దు

మహబూబ్‌నగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో శనివారం పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బెంగళూరు, తిరుపతి, ఎగ్మోర్‌ తదితర ప్రాంతాల నుండి హైదరాబాద్‌ వచ్చే అనేక రైళ్లలో కొన్నింటిని దారి మళ్లించారు. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిన వెంటనే దక్షిణ మధ్య రైల్వే అధికారులు హైదరాబాద్‌ - మహబూబ్‌నగర్‌ రూట్లో నడిచే అన్ని రైళ్లను ఎక్కడివక్కడే నిలిపివేశారు. కొన్నింటిని మాత్రం దారిమళ్లించారు. ప్రమాదం తెలిసిన వెంటనే మహబూబ్‌నగర్‌ స్టేషన్లో సంపర్క్‌ క్రాంతి, ఎగ్మోర్‌-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలిపివేశారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ను తిమ్మాపూర్‌లో, బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌ను బాలానగర్‌లో నిలిపివేశారు. ప్రయాణీకులు ఇబ్బందులు పడకుండా వెంటనే ఆర్టీసి యాజమాన్యంతో చర్చించి వారిని బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించారు. కాచిగూడ-గుంతకల్‌, కాచిగూడ-గుంటూరు, సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌, కాచిగూడ-మహబూబ్‌నగర్‌ ప్యాసింజర్లు, కాచిగూడ-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌, కాచిగూడు-చిత్తూరు మధ్య నడిచే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లను ఆదివారం కూడా రద్దు చేశారు. శనివారం రాత్రి బయల్దేరాల్సిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ను గుంతకల్లు, వాడి, ఆధోని, మంత్రాలయం మీదుగా మళ్లించారు. ఇదిలావుండగా యశ్వంత్‌పూర్‌-హజ్రత్‌ నిజామొద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ, వరంగల్‌, బల్లార్షా మీదుగా దారి మళ్లించారు. యశ్వంత్‌పూర్‌-కోర్బా స్పెషల్‌ రైలును గుంతకల్‌, హల్‌కట్ట, సికింద్రాబాద్‌, కాజీపేట, బల్లార్షా మీదుగా, హజ్రత్‌ నిజామొద్దీన్‌-తిరుపతి ఎపి సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్‌, హల్‌కట్ట, రాయిచూర్‌, గుంతకల్‌, గుత్తి మీదుగా మళ్లిస్తున్నారు. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్‌, హల్‌కట్ట, రాయిచూర్‌, గుంతకల్‌ మీదుగా, కాచిగూడ-చెన్నై ఎగ్మోర్‌ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్‌, హల్‌కట్ట, రాయిచూర్‌, గుంతకల్‌, గుత్తి, రేణుగుంట మీదుగా దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్