కొల్లేరు ప్రజల సంరక్షణ పట్టని ప్రభుత్వం

  • 120 జీవోను రద్దు చేయాలి
  • కాంటూరును 3కు కుదించాలి
  • పోరాటాలతోనే హక్కుల సాధన
  • రౌండ్‌టేబుల్‌లో వక్తల పిలుపు

కొల్లేరు కాంటూరు పరిధిలో ఉన్న ప్రజలు, రైతులు, మత్స్యకారుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కొల్లేరు ప్రజల జీవనానికి, మనుగడకు ముప్పు తెచ్చిన 120 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కొల్లేరు ప్రజల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల కొల్లేరు ప్రాంతీయ వ్యవసాయ మత్స్య సహకార సంఘాల సంక్షేమ సంఘం అధ్యక్షులు జయమంగళ రామారావు అధ్యక్షతన జరిగింది. ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగల సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల మూలంగా కొల్లేరు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఎపి రైతు సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు బి తులసీదాస్‌ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడ్డమే ప్రభుత్వ లక్ష్యమైతే చిత్తడి నేలలున్న భూమిని సొంసేటలో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లను ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు ప్రాంతీయ వ్యవసాయ మత్స్య సహకార సంఘాల సంక్షేమ సంఘం కార్యదర్శి సైదు సత్యనారాయణ , ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ ప్రభృతులు కూడా మాట్లాడారు. కొల్లేరు ఆపరేషన్‌ సందర్భంగా చెప్పిన ప్యాకేజీ అమలు చేయాలని, మంచినీరు, రోడ్లు, విద్యావైద్యం, మౌలిక వసతులు కల్పించాలని, సర్కారు కాలువ వంతెన పూర్తి చేయాలని,ముంపును నివారించాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బలరాం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కార్యక్రమంలో ఎపి మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం నగర అధ్యక్షురాలు పద్మ, ఎపి కమ్మరం, వడ్రంగం వృత్తిదారుల సంఘం ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.