'నా వరకూ త్రీ ఇడియట్స్ తీయడం చాలా సులభమనిపించింది. ఇందులో నటించే ముగ్గురు నటులకు ఈ ప్రాజెక్టు మినహా మరోటి లేకపోవడం కారణం కూడా కావచ్చు. దానివల్ల వీరంతా నాకు అందుబాటులో ఉన్నారు. పొద్దున 4 గంటలకు షాట్ తీయాలన్నా, రాత్రి 12 గంటలకు తీయాలన్నా సిద్ధంగా నటులు దొరకడం ఒకరకంగా నా పనిని సులభం చేసింది' అని అంటున్నారు..'త్రీ ఇడియట్స్' దర్శకులు రాజ్కుమార్ హిరానీ. 2009 సంవత్సరాంతంలో వచ్చిన క్రిస్మస్, మొహర్రం పండుగల ఆనందాన్ని ఈ చిత్రం పెంచిందని హిరానీ చెప్పుకొస్తున్నారు. థియేటర్ల దగ్గర జనాన్ని చూస్తే ఇది నిజమేననిపిస్తుంది. ఇంకా ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించిన విశేషాలు చెబుతున్నారు ఇలా..
నెల రోజులు ప్రాక్టీస్ చేశారు
ప్రతి ఒక్కరూ ప్రిపేరయ్యి వచ్చేవారు. ఒక్కోసారి నెలరొజులపాటు ప్రాక్టీస్ చేసిన సందర్భాలున్నాయి. 'లగే రహో మున్నాభాయి' తర్వాత మూడు సంవత్సరాల గ్యాప్ అనంతరం ఈ చిత్రం తీశాను. స్క్రిప్ట్ విషయంలో మాత్రం ప్రశంసలన్నీ అభిజిత్ జోషీకే దక్కుతాయి. అంతరాయం లేకుండా స్క్రిప్ట్ వర్క్ రాయడంలో సిద్ధహస్తుడు అభిజిత్ జోషి. స్క్రిప్ట్ రాయడం మొదలెట్టాక..ఓ నెలరోజుల్లో పూర్తి చేస్తా అనుకున్నాం. రాయడం కుదర్లేదు కానీ..దాని గురించి మాట్లాడు కోవడానికే నెలరోజులు పట్టింది. నా కాలేజీ అనుభవాలూ, అతని కాలేజీ అనుభవాలూ..ఇలా ఏదైనా మా సబ్జెక్టుకు దగ్గరా ఉంది అనిపిస్తే రికార్డ్ చేసేం వాళ్లం.
చేతన్ భగవత్ రాసిన 'ఫైవ్ పాయింట్స్ సమ్వన్'
ఒరిజనాలిటీని మాత్రం చేతన్ భగవత్ రాసిన 'ఫైవ్ పాయింట్స్ సమ్వన్' నుంచి సంగ్రహించాం. అసలు పనిలోకి దిగాకకానీ మాకు తెలియలేదు. పుస్తకంలోనిదంతా చూపలేం అని. ఓ పుస్తకాన్ని రాయడానికి, దాన్ని సినిమా తీయడానికి చాలా తేడా ఉంది. 18 రోజుల్లో ఏమేం తీయాలో నిర్ణయించుకున్నాం. ఇలా రూపొందించుకున్నదాన్ని తెరకెక్కించడానికి మాత్రం 18 నెలలు పట్టింది.