డాక్టర్ రాజేంద్రప్రసాద్ మరో విభిన్న పాత్రలో ప్రేక్షకులను రంజింపచేయడానికి సిద్ధమవుతున్నారు. లక్కీమీడియా సంస్థ నిర్మిస్తోన్న 'బ్రహ్మలోకం టు యమలోకం' (వయా భూలోకం)లో ఆయన బ్రహ్మదేవునిగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రచయిత గోళ్లపాటి నాగేశ్వరరావు దర్శకునిగా పరిచయమవుతున్నారు. యుతోపియా ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్ సమర్పణలో బెక్కెం వేణుగోపాల్, రూపేష్, డి. గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివాజీ, సోనియా, ఆర్తి అగర్వాల్, కళ్యాణి ముఖ్య తారాగణం. నిర్మాతలు తెలియజేస్తూ, వినోదమే ప్రధానంగా రూపొందుతోన్న సోషియో ఫాంటసీ చిత్రమిది. బ్రహ్మదేవునిగా రాజేంద్రప్రసాద్ అభినయిస్తున్నారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ లాంటి మహానుభావులు అనేక రకాల పౌరాణిక పాత్రలు పోషించారు. పౌరాణిక పాత్ర పోషణలో వారి తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. వారిద్దరూ చేయని పాత్ర బ్రహ్మదేవుడు. తొలిరోజు ఆ పాత్రలో ఆయన్ను చూసి తన్మయావస్థకు గురయ్యాం. బ్రహ్మదేవుని నాలుగు తలలు నిజమైనవిగా చిత్రీకరిస్తున్నాం. ఇందుకు గత నాలుగు నెలలుగా గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది' అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, తాను ఇంతవరకు చేయనటువంటి పాత్రను పోషిస్తున్నాననీ, సృష్టిని చేసే బ్రహ్మ పాత్ర దక్కడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, షూటింగ్ పూర్తికావస్తోంది. చాలా రిచ్గా ఉంటుంది. రాజేంద్రప్రసాద్ పాత్ర మెచ్చుకోదగిందిగా ఉంటుందని చెప్పారు. విజువల్గా కనువిందు చేస్తున్నందనీ, వాసు తన నైపుణ్యంతో సరికొత్తగా ప్రెజెంట్ చేస్తున్నారని పేర్కొన్నారు. తనకు తొలి సినిమానే మంచి కథాంశంతో లభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం.శ్రీలేఖ, కెమెరా: వాసు, ఎడిటింగ్: నాగిరెడ్డి, పాటలు: రవికుమార్.