టీవీ ఛానెళ్లలో నేర, అశ్లీల ప్రసారాల నియంత్రణకు త్వరలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. ఈ కమిటీ ఆయా ఛానెళ్లపై దృష్టి పెడుతుందన్నారు. టీవీ ఛానెళ్లలో అశ్లీలం, నేర ప్రసారాలు మితిమీరి పోతున్నాయని, ఫలితంగా యువత పెడదోవ పడుతోందని, మహిళలపై తీవ్ర ప్రభావం పడుతోందని, వెంటనే ఇలాంటి ప్రసారాలను నిలిపివేయాలంటూ ఛానెళ్ల యాజమాన్యాలను గతంలోనే హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కమిషనర్ ఖాన్ శుక్రవారం రాష్ట్రంలోని టీవీ ఛానెళ్ల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాలను ప్రతి ఛానెల్ యాజమానీ పాటించాలని సూచించారు. టీవీ ఛానెళ్ల యాజమా న్యాలు చెప్పిన విషయాలను కూడా ఆయన విన్న తర్వాత, హైకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. సమావేశం అనంతరం ఎకె ఖాన్ మీడియాతో మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘించిన ఛానెళ్లకు వారం తర్వాత నోటీసులు జారీ చేస్తామని ఆయన తెలిపారు. ఇక నుంచి కేబుల్ ప్రసారాలపై పోలీసుల పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే కేబుల్ టివి 1995 చట్టాన్ని ఉల్లంఘిస్తే ఈనెల 22వ తేదీ నుంచి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.