'మనిషి కథ'కు రాష్ట్రస్థాయి ప్రశంస

స్థానిక వివేక పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు, ప్రముఖ ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌, బాలసాహితీవేత్త షేక్‌ హకీం జాని రచించిన బాలసాహిత్య పుస్తకం మనిషి కథ పుస్తకానికి రాష్ట్రస్థాయి ప్రత్యేక ప్రశంసా పత్రం లభించింది. హైదరాబాద్‌కు చెందిన బాలసాహితీ పరిషత్‌, అరుణోదయ ఆర్ట్‌ క్రియేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి బాల సాహిత్య గ్రంథాల పోటీల్లో హకీంజాని రచించిన మనిషి కథ పుస్తకం ఉత్తమ బాలసాహిత్య గ్రంథంగా ఎంపికైనట్లు ప్రశంసా పత్రాన్ని సంస్థ నిర్వాహకులు చొక్కపు వెంకటరమణ, దాసరి వెంకటరమణ పోస్టుద్వారా పంపారు. ప్రముఖ బాల సాహితీవేత్త, గ్రంథాలయోద్యమ ప్రముఖుడు డాక్టర్‌ వెలగా వెంకటప్పయ్య, స్వచ్ఛంద సేవా సంస్థ పావులూరి ట్రస్ట్‌ కార్యదర్శి పావులూరి శ్రీనివాసరావు ప్రశంసా పత్రాన్ని హకీంజానికి ఆదివారం అందించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల డైరెక్టర్‌ డాక్టర్‌ రావిపాటి వీరనారాయణ, ప్రిన్సిపాల్‌ పాలడుగు వెంకట్రామయ్య హకీం జానికి అభినందనలు తెలిపారు.