ప్రజాశక్తి మార్కాపురం రూరల్ : మండల పరిధిలోని గ్రామాల్లో ఈనెల 9 నుంచి19 వరకూ కులగణన సర్వే నిర్వహించనున్నట్లు డిఎల్డిఒ బివిఎన్. సాయికుమార్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కులగణన సర్వేపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎల్డిఒ మాట్లాడుతూ కులగణన సర్వే నూరు శాతం గహాలను కవర్ చేసే విధంగా ఉండాలన్నారు. 1931 కులగణన సర్వే తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఇప్పుడు సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సహాయంతో సర్వే నిర్వహించాలన్నారు. సేకరించిన సమాచారాన్ని గోప్యతగా ఉంచాలన్నారు. ప్రజలు కూడా సహకరించాలన్నారు. ఈ సమావేశంలో ఎంపిడిఒ తోట చందన, తహశీల్దారు మంజునాథ్ రెడ్డి, మండల విస్తరణ అధికారి రామ్మోహన్ రెడ్డి, ఎఎస్డబ్ల్యుఒ, సర్పంచులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. పెద్ద దోర్నాల : కులగణన సర్వేపై మండల విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో మండల ప్రత్యేకాధికారి జగన్నాధరావు అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్నాధరావు మాట్లాడుతూ ఈనెల 9 నుంచి 18 వరకూ కులగణన సర్వే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ఈనెల 15నుంచి ఆడుదాం-ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. వాటిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ నాసరరెడ్డి, తహశీల్దారు వేణుగోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.