173 సంవత్సరాల పురాతనమైన జర్మన్ హెల్త్కేర్ కంపెనీగా పేరొందిన బి.బ్రౌన్ ఇండియా సబ్సిడరీ కంపెనీ బి.బ్రౌన్ మెడికల్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో డయాల్సిస్ మిషనరీ బిఒటి (బిల్ట్, ఆపరేట్ి,ట్రాన్సఫర్) ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం కింద 11 ప్రాంతాలలో 111 డయాల్సిస్ మిషన్లను ఏర్పాటుచేసి రోజుకు వెయ్యి మంది కిడ్ని పేషెంట్లకు చికిత్స ఇవ్వనున్నట్లుగా కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఎనిమిది ప్రాంతాలలో 83 మిషన్లను ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. మార్చి,13 నాటికి వీటి ద్వారా 7500 మందికి ట్రీట్మెంట్ అందించినట్లుగా కూడా తెలిపారు. ఇక మిగిలిన మూడు ప్రాంతాల్లో 2010, ఏప్రిల్ చివరి నాటికి ఏర్పాటు చేయనున్నట్లుగా వివరించారు. ఏడు సంవత్సరాల తర్వాత ఈ మిషనరీని ప్రభుత్వానికి అప్ప చెప్పనున్నట్లుగాను, ఒక్కో మిషన్తో రోజుకు ముగ్గురికి డయాల్సిస్ చేయొచ్చన్నారు. అందుకోసం రూ.1050 వసూళ్ళు చేస్తున్నట్లుగా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి, ఆరోగ్యశ్రీ పథకం కింద అందించే సహయాలలో ఈ ట్రీట్మెంట్ కూడా ఉందని పేర్కొన్నారు. దేశంలో తమ కంపెనీని 1994లోనే ఏర్పాటు చేశామని, 350 ఉద్యోగులతో చెన్నైలో సుటరీస్ ఉత్పత్తి కేంద్రం ఉందని వివరించారు. ఇలా సేవా పద్ధతితో తమ కేంద్రాలను ఏర్పాటు చేయటమనేది దేశంలో ఇదే మొదటి సారన్నారు. ఈ విధానం విజయవంతమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటువంటి పద్ధతిలో మరిన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసే ఉద్దేశాన్ని కూడా ఈ సందర్భంగా వివరించారు.