తిరుమల చోరీలపై ఎస్‌పి సమీక్ష

తిరుమలలో భక్తులు బసచేసే కాటేజీలు, వసతి సముదాయాలలో చోటుచేసుకుంటున్న చోరీ సంఘటనలను టిటిడి తీవ్రంగా పరిగణిస్తోంది. వీటిని అరికట్టేందుకు ఆదివారం తిరుమల స్పెషలాఫీసర్‌ ధర్మారెడ్డి, టిటిడి చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఎంకె సింగ్‌లతో ఎస్‌పి లక్ష్మీరెడ్డి సమీక్షించారు. స్థానిక పోలీసు అధికారులు మాట్లాడుతూ ఇటీవల కొంత కాలంగా జరుగుతున్న చోరీలకు సంబంధించి 90 శాతం నగదు, సొత్తను స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలు సమర్పించినట్లు పేర్కొన్నారు. అనంతరం స్థానిక అన్నమయ్య భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో స్పెషలాఫీసర్‌ ధర్మారెడ్డి మాట్లాడుతూ తిరుమలలో భక్తులు బసచేసే కాటేజీలు, అతిథి గృహాలు, తరితర విచారణ కార్యాలయలలో దశల వారీగా లాకర్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు తిరుమలలోని అన్ని బ్యాంకుల వారు ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పద్మావతీ విచారణ కార్యాలయంలో ఆంధ్రాబ్యాంకు ఆధ్వర్యంలో లాకర్లను ఏర్పాటు చేశామని, ఈ లాకర్లలో భక్తులు నగదు, నగలు భద్రపరుచుకోవచ్చన్నారు. భక్తులు ఎట్టి పరిస్థితిల్లోనూ తమ బసచేసిన గదుల్లో నగలు, నగదును ఉంచరాదన్నారు. కాటేజీల గదుల తాళాలను జంబ్లింగ్‌ విధానంలో తరచూ మార్చుతున్నామని అయినా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. తిరుమలలో 7వేలా ఐదు వందల గదులున్నాయని, వీటిలో పలు రకాల చోరీలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల జరిగిన సంఘటనలలో పలువురిని అదుపులోకి తీసుకుని వారి నుండి సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తిరుమల సిఐ వెంకటనాథ్‌రెడ్డి మాట్లాడుతూ శనివారం యాత్రిక సదన్‌లోని లాకర్లలో చోరీ జరిగిందని, ఇందుకు కారకులను త్వరలో పట్టుకుంటామన్నారు. ఈ సమావేశంలో తిరుమల విజిఓ శాంబశివారెడ్డి, రిసెప్షన్‌ డిప్యూటీ ఇఓ ఉమాపతి, ఓఎస్‌డి చిన్నంగారి రమణ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్