ఖైదీలకన్నా హీనం


  • విద్యార్థులకు రూ.17
  • ముద్దాయిలకు రూ.30
  • మెనూలో ఎంతో వ్యత్యాసం
  • సం'క్షేమం' పట్టని పాలకులు

'వారు ఏం తప్పు చేయలేదు.. అయినా జైలు గదుల్లాంటి గదుల్లోనే ఉంటున్నారు.. చదువుకోవాలి అన్న ఉత్సుకతే వారిని సర్దుకుపోయేలా చేస్తోంది.. ఇరుకు గదుల్లో ఎలాగోలా ఉంటున్నారు. కాని 'అర్ధాకలి' చదువులకు దూరం చేస్తోంది. రాత్రి తిన్న భోజనం సరిపోక అర్ధరాత్రయితే చాలు కడుపులో ఎలకలు పరుగెడుతుంటాయి. పాలకులకు వీరి సంక్షేమం ఏమాత్రం పట్టడం లేదు.. వీరి 'మెనూ'కు ఒక్కొక్కరికి ప్రభుత్వం ఇచ్చేది కేవలం 17 రూపాయలే. అదే జైల్లో ఉండే ముద్దాయిలకు 30 రూపాయలు ఇస్తున్నారు. వీరి బతుకులు ఖైదీలకంటే హీనంగా ఉన్నాయి. అర్ధాకలితో చదవలేక, కనీస సౌకర్యాలు లేక పరీక్షల్లో ఫెయిలై విద్యావ్యవస్థ ముందు దోషులుగా నిలబడుతున్నారు. వీరే భావిభారత 'బలహీన' పౌరులు.'

పాలకుల నిర్లక్ష్యం వల్ల సంక్షేమరంగం సంక్షోభంలో కూరుకుపోయింది. రోజురోజుకూ బడ్జెట్‌లో వీరి నిధులకు కోత పడుతోంది. నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు మాత్రం ఒక రోజు భోజనం ఖర్చు రూ.30లు. అదే వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఒక రోజు భోజనం ఖర్చు రూ.17లకు మించడం లేదు. అసలే ధరలు మండిపోతున్నాయి. ఈ 17 రూపాయలతో ఎలా కడుపు నింపుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. ఇటీవల కాలంలో కలెక్టర్‌ సైతం రాత్రి వేళల్లో హాస్టళ్లలో నిద్రిస్తున్నారు. అయితే తనిఖీలు చేస్తున్నారే తప్ప విద్యార్థులకు ఒక రోజుకు 17 రూపాయలు ఎలా సరిపోతుందని మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు.

ముద్దాయిలకు రూ.30

జిల్లాలో 8 సబ్‌ జైళ్ళు ఉన్నాయి. ఇందులో 300 మంది ఖైదీలకే పరిమితం. వీరి భోజనాలకు 2009 ఏప్రిల్‌ నుంచి 2010 మార్చి వరకు 44 లక్షల 8వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. వీరిలో ఒక ఖైదీపై సంవత్సరానికి 14 వేల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం పెడతారు. వీరికి ఒక రోజుకు 70 ఎంఎల్‌ పెరుగు, ఆదివారం రోజున నాన్‌ వెజ్‌ ఉంటుంది. ప్రతి ఖైదీకి భోజనం ఖర్చుగా ప్రతి రోజూ రూ.30 ఖర్చు చేస్తున్నారు. సంవత్సరంలో డైట్‌ కు 31 లక్షలను ఖర్చు చేయగా, మిగిలిన 13 లక్షల 8వేల రూపాయలను ప్రతి ఖైదీకి నెలలో రెండు రోజులు వైద్య పరీక్షలు నిర్వహించే వైద్యునికి నెలకు రూ.700 ఇవ్వాలి. కాస్మోటిక్స్‌ తప్పనిసరి.

విద్యార్థులకు రూ.17

జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 127 ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ భవనాలు 91 ఉండగా 36 భవనాలు ప్రయివేటు భవనాల్లో నడుస్తోంది. వీటిలో చదువుకునే విద్యార్థులు 10,579 మంది ఉన్నారు. ఆనంద్‌ నిలయం, చిల్డ్రన్‌ హోంలు ఐదు ఉన్నాయి. వీటిలో 400 మంది చదువుకొంటున్నారు. వీటన్నింటికీ భోజనం ఖర్చులకు 2009-10 సంవత్సరానికి 4 కోట్ల 69 లక్షల 73 వేల 670 రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. మూడవ తరగతి నుండి ఏడవ తరగతి చదువుకుంటున్న ఒక్కొక్క విద్యార్థికి నెలకు 475 చొప్పున ఒక రోజుకు రూ.15.32 లు ఖర్చు పెడుతున్నారు. అదే విధంగా ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ఒక్కోక్క విద్యార్థికి నెలకు రూ.530 లు ఒక రోజు రూ.17.25 ఖర్చు పెడుతున్నారు. ఈ డబ్బుతో రెండు పూట భోజనం, ఒక పూట టిఫిన్‌ పెట్టాలి. సాయంత్రం పూట సుండలు, ప్రతి రోజు అరటి పండు, వారంలో కోడి గుడ్డు నాలుగు సార్లు, వారంలో ఒక రోజు స్వీట్‌. అదే విధంగా ప్రభుత్వ బియ్యానికి కిలో నాలుగు రూపాయలకు కొంటున్నారు. ఇవన్నీ గోడలకే పరిమితమైన మెనూ. రోజూ తినేది మాత్రం నీళ్లచారు, నీళ్ల మజ్జిగ. చాలీచాలని బడ్జెట్‌తో విద్యార్థులు అర్ధాకలితో చదువులు సా..గిస్తున్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్