విజ్ ఆన్ జీ (ది నెదర్లాండ్స్) : కోరస్ చెస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు శనివారం విజయాలు నమోదు చేశారు. గ్రూప్ 'ఎ'లో విశ్వనాథన్ ఆనంద్ డ్రాతో ముగించగా, అభిజిత్ గుప్తా గ్రూప్ 'సి'లో విజయం సాధించాడు. నార్వేకు చెందిన మాగస్ కార్ల్సన్తో ఆనంద్ తెల్ల పావులతో తలపడ్డాడు. ఈ డ్రాతో ఆనంద్ మొత్తం మూడు పాయింట్లు సాధించాడు. మరోవైపు అభిజిత్ గుప్తా విజయపరంపర కొనసాగుతోంది. ఇటలీకి చెందిన డేనియెల్లీ వొకాటురోను ఓడించాడు. ఈ విజయంతో అభిజిత్ పాయింట్ల సంఖ్య నాలుగుకు చేరింది. గ్రూపు 'బి'లో పరిమార్జన్ నెగీకి ఓటమి ఎదురైంది. డచ్కు చెందిన ఎర్విన్ ఎల్ అమ్ని చేతిలో నెగీకి పరాభవం ఎదురైంది. దీంతో మూడు పాయింట్లతో ఎనిమిదో స్థానానికి దిగజారాల్సి వచ్చింది. బరిలో ఉన్న మరో భారతీయ క్రీడాకారుడు పి.హరికృష్ణన్ కూడా శనివారం డ్రాతో ముగించాడు. అమెరికాకు చెందిన వరుఖాన్ అకోబియన్తో హరికృష్ణన్ తలపడ్డాడు. దీంతో 3.5 పాయింట్లతో మరొకరితో కలిసి నాలుగో స్థానంలో నిలిచాడు.