మగధీరుడు వైఎస్‌ఆర్‌

  • వ్యవసాయమంత్రి రఘువీరారెడ్డి

అనుక్షణం రైతుల సంక్షేమం కోసం పరితపించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన కీర్తిశేషులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మగధీరుడని వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. నగరంలో రైతు సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రితో పాటు కలెక్టర్‌ జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎద్దులబండ్లపైన, ట్రాక్టర్లపైన ఆర్ట్స్‌ కళాశాల నుంచి టవర్‌క్లాక్‌ మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కెఎస్‌ఆర్‌ కళాశాల ఆవరణలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ జనార్ధన్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి రఘువీరా మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే రైతాంగం అభివృద్ధి చెందిందన్నారు. విడుదలైన ఇన్సూరెన్స్‌ వల్ల సుమారు నాలుగు లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు, నిరుద్యోగులు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, యువతీ యువకులకు అందరికీ లబ్ధిచేకూర్చేలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని అన్నారు. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపడమే తమప్రభుత్వధ్యేయమన్నారు.మ ఈ నెల 23వ తేదీ నుంచి రైతులకు ఇన్సూరెన్స్‌ చెల్లించేందుకు అన్ని విధాలా చర్యలను బ్యాంకర్లు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ నెల 28వ తేదీన హంద్రీనావా నీరు విడుదల చేసేందుకు జిల్లాకు నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ఆహ్వానిసున్నామని తెలిపారు. ఉత్తమ ఆదర్శ రైతులను సన్మానించేందుకు, ప్రోత్సహిచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ ఇందిరాగాంధీ నాయకత్వం నుంచీ పని చేస్తోందని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ఇన్సూరెన్స్‌ ప్రకటించిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా వైఎస్‌ఆర్‌ చేపట్టిన పథకాల అమలు తీరును పరిశీలించేందుకు మన రాష్ట్రానికి రావడం గర్వకారణమన్నారు. వైఎస్‌ఆర్‌ ఆశయాలను రోశయ్య నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. 2011 రైతు సంక్రాంతి సంబరాలను వైఎస్‌ఆర్‌ సంక్రాంతి సంబరాలుగా ప్రకటించారన్నారు. వచ్చే సంక్రాంతి సంబరాల్లో రైతులతో పాటు ఉద్యోగులను కూడా సన్మానించనున్నట్లు తెలిపారు.

రైతులను రాజును చేస్తాం: ఎంపి

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రైతులను రాజును చేస్తామని ఎంపి వెంకటరామిరెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌ స్ఫూర్తితోనే ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నామని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామన్నారు. కీర్తిశేషులు వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రి కాకముందు కూడా రైతుల కోసం, ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని పోరాటాలను నిర్వహించిన మహానుభావుడని కొనియాడారు.

శింగనమల నియోజకవర్గంపై దృష్టి పెట్టండి: ప్రభుత్వ విప్‌

నదీజలాలను, నిధులను కేటాయించడంలో శింగనమల నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ విప్‌ శైలజానాథ్‌ మంత్రి రఘువీరారెడ్డికి సూచించారు. ప్రతిపక్ష పార్టీల నోర్లకు కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన బీమానే కట్టివేస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పద్ధతులను మానుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు: నగర మేయరు

సంక్రాంతి లోగా రైతులకు బీమా చేరుతుందని మంత్రి రఘువీరారెడ్డి, ఎంపి అనంతవెంకట్రామిరెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని నగర మేయరు రాఘేపరుశురాం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 800 కోట్ల రూపాయలువ విడుదల కాగా మన జిల్లాకే 600 కోట్లు విడుదల చేయించిన ఘనత మంత్రి, ఎంపికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ తోపుదుర్తి కవిత, జెసి అనితారామచంద్రన్‌, ఆర్డీఓ గౌతమి, జెడిఎ ఫహీమ్‌, ఎడిఎ అశోక్‌కుమార్‌, మడకశిర ఎమ్మెల్యే సుధాకర్‌, గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్‌, ఎమ్మెల్సీలు శివరాంరెడ్డి, పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి, వ్యవసాయశాఖ అనుబంధ శాఖ ఎడిఎలు, జెడిఎలు, ఆదర్శరైతులు తదితరులు హాజరయ్యారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్