నిరసనలు... నిలదీతల మధ్య సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రజాపథం కార్యక్రమం ప్రారంభమైంది. గత రచ్చబండ కార్యక్రమ్లఓ విన్నవించిన సమస్యలనే ఇంత వరకు పరిష్కరించలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య, ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల సమస్యలు, భూనష్టపరిహారం సమస్యలపై ప్రజలు, సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు ప్రజాప్రతినిధులను, అధికారులను నిలదీశారు. గుత్తిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్గుప్తాను నిలదీశారు. ధర్మవరంలో సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్వయంగా ప్రజల మధ్య కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.
అనంతపురం అర్బన్: రేషన్కార్డుదారుల నుంచి రేషన్డీలర్లు బ్యాంకు అకౌంట్ల సేకరణను ఆపాలని సిపిఎం నగర కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. సోమవారం నగరంలో యర్రనాలకొట్టాల్లో ప్రజాపథం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ గత ప్రజాపథంలో విన్నవించిన సమస్యలే ఇంత వరకు పరిష్కారం కాలేదని ఎంపీని నిలదీశారు. నగరంలో అనేక సమస్యలు తిష్టవేశాయని అన్నారు. వాటిని పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలర్లు రేషన్కార్డుదారుల నుంచి అకౌంటు ఖాతాలను సేకరిస్తున్నారని చెప్పారు. దీన్ని ఆపాలని డిమాండ్ చేశారు. అకౌంటు నెంబరు ఇస్తేనే రేషన్ ఇస్తామని డీలర్లు చెబుతున్నారని అన్నారు. ప్రభుత్వం జిల్లాలో నగదు బదిలీ పథకం అమలు చేయడానికి అకౌంట్లను సేకరిస్తున్నారని తెలిపారు. ఈ పథకం అమలయితే పేదలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ గృహ పథకం రెండు, మూడో విడత కింద 7,500 మంది లబ్ధిదారులను గుర్తించారన్నారు. వారికి పట్టాలు ఇచ్చారని, ఇంత వరకు స్థలాలు చూపించలేదన్నారు. గత రచ్చబండ కార్యక్రమంలో మంత్రి శైలజానాథ్కు ఈ సమస్యపై అర్జిలు ఇచ్చామని, ఇంత వరకు పరిష్కారం కాలేదన్నారు. ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ అకౌంట్లు ఇవ్వని పేదలకు రేషన్ ఇవ్వమని చెబుతున్న డీలర్లపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ నాగభూషణంకు ఆదేశించారు. ఖాతాల సేకరణకు, నగదు బదిలీ పథకానికి సంబంధం లేదన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు కామారుపల్లి దగ్గర త్వరలోనే ఇళ్ల స్థలాలు చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు ప్రకాష్, ఖాజా, శీనా, నటరాజ్, మహేష్, రాజేశ్వరి, జయమ్మ, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.
నామామాత్రంగా ప్రజాపథం
నగరంలో నిర్వహించిన ప్రజాపథం కార్యక్రమం సోమవారం నామమాత్రంగా జరిగింది. నగరంలోని యర్రనాలకొట్టాలలో జరిగిన ప్రజాపథం కార్యక్రమానికి ప్రజలు ఎవరూ హాజరవలేదు. కేవలం ముగ్గురు మాత్రమే సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ప్రజలు ఎవరూ రాకపోవడంతో ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు చెక్కులు పంపిణీ చేసి ముగించారు. ఈకార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనరు నీలకంఠారెడ్డి, తహసీల్దార్ నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.