ప్రజాశక్తి-పామిడి (అనంతపురం) : వరుస దొంగతనాలతో పామిడి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మండలంలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అందినకాడికి దోచుకుంటున్నారు. గత కొద్దిరోజుల కిందట వెంగమ నాయుడు కాలనీలో కిరాణా షాపుల్లోనూ, పలు ఇళ్లలోనూ దొంగతనాలు జరిగిన ఘటనలు మరువకముందే మంగళవారం తెల్లవారుజామున వేర్వేరు షాపుల్లో చోరీలు జరిగాయి. స్థానిక ఎద్దులపల్లి సర్కిల్ వద్ద ఉన్న టీ స్టాల్ , మెడికల్ షాపు, కిరాణా షాపుల్లో గుర్తుతెలియని దుండగులు దొంగతనం చేశారు. నాగ మల్లారెడ్డి మెడికల్ షాప్ లో షట్టర్ను పగులగొట్టి లాకర్లో ఉన్న చిల్లర నగదును దొంగిలించారు. శ్రీనివాసులు కిరాణా అంగడిలో సిగరేట్ బండల్స్ను ఎత్తుకుపోయారు. రవి టీ స్టాల్ లో ఉన్న చిల్లర నగదును కాజేశారు. దొంగలు చోరీకి పాల్పడిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగల కోసం గాలిస్తున్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తుతో అప్రమత్తంగా ఉన్నప్పటికీ చోరులు వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.