తిరుపతి : టిటిడి కొత్త నిబంధన తీసుకువచ్చింది. తిరుమల కల్యాణవేదికలో టిటిడి ద్వారా పెళ్లి చేసుకోవాలంటే ఇకపై తప్పనిసరిగా వివాహం కాలేదంటూ ధ్రువీకరణ (అన్ మ్యారీడ్) సర్టిఫికేట్ ఉండాల్సిందే. ఈ మేరకు టిటిడి ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల క్రితమే దీనిపై నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇకపై దానిని కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది. శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలనుకునేవారికి తిరుమలలోని కల్యాణవేదికలో టిటిడినే ఉచితంగా వివాహాలు జరిపిస్తోంది. దీని కోసం వధువు, వరుడు పుట్టిన తేదీలు, విద్యార్హత పత్రాలు, తల్లిదండ్రుల ఆధారకార్డులు, శుభలేఖ, లగ్నపత్రికను సమర్పించాల్సి ఉంటుంది. వధువు, వరుడు తల్లిదండ్రులు తప్పనిసరిగా వివాహానికి హాజరు కావాలి. ఒకవేళ ఎవరైనా మరణించి ఉంటే వారి డెత్ సర్టిఫికేట్ జత చేస్తేనే ఆ దరఖాస్తును పరిశీలిస్తారు.
అయితే టిటిడికి ఇటీవల కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. కొందరు భార్య, లేక భర్త విడిపోయి తిరుమలలో రెండో వివాహం చేసుకోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో ఇతర పత్రాలతోపాటు అన్ మ్యారీడ్ సర్టిఫికేట్ కూడా జత చేయాలని టిటిడి అధికారులు నిబంధన విధించారు. ఎవరైనా ఆ సర్టిఫికేట్ తీసుకురాకపోతే వరుడు, వధువు వయస్సు 25 ఏళ్ల లోపు ఉన్న టిటిడి ఉద్యోగుల్లో ఎవరైనా తెలిసినవారు ఉంటే వారితో లేఖ రాయించుకుని పెళ్లికి అనుమతి ఇస్తున్నారు. వయస్సు అధికంగా ఉన్నవారిని మాత్రం తిరస్కరిస్తున్నారు. వధువు, వరుడు తమ ప్రాంతంలోని ఎమ్మార్వో నుంచి సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. ఒకవేళ వారు అందుబాటులో లేకపోతే వీఆర్వో, గ్రామ పంచాయతీ బాధ్యుల నుంచి సర్టిఫికేట్ తీసుకోవచ్చు. మరోవైపు కల్యాణవేదికలో జరిగే వివాహ వేడుకను వీడియో రికార్డు చేసుకునేందుకు అదనపు లైట్ల అమరికకు వీలు లేదని టిటిడి కొత్త నిబంధన విధించింది.