నమూనా చెక్కును అందజేస్తున్న కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
జిల్లాలో గతేడాది సంభవించిన మిచాంగ్ తుపానులో నష్టపోయిన 661 మంది రైతులకు రూ.32.21 లక్షలు ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం విడుదల చేసినట్టు కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. కలెక్టరేటులో ఇన్ఫుట్ సబ్సిడీ నమూనా చెక్కును బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతాంగానికి ప్రకృతి వైఫరీత్యాల వల్ల జరిగిన నష్టాలను ప్రభుత్వం గుర్తించి ఆర్థికంగా ఆదుకుంటోందన్నారు. జిల్లాలో పంట నష్టపోయిన రైతన్నలకు నష్టపరిహారాన్ని వ్యక్తిగత ఖాతాలో డిబిటి పద్ధతిలో జమ చేశామన్నారు. అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకుండా ఈ-క్రాప్ ఆధారంగా పంట నష్టాల ను అంచనా వేస్తూ గ్రామ సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శించారని అన్నారు. సీజన్లో జరిగిన పంట నష్టాన్ని సీజన్ ముగిసేలోగానే ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, వ్యవసాయశాఖ జెడి కె.శ్రీధర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నేతాజీ, డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, ఉద్యాన అధికారి ఆర్.వి.ప్రసాద్ పాల్గొన్నారు.