- ఇకపై అయోధ్యలో ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం’
- కేంద్ర మంత్రివర్గం ఆమోదం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 2021-26 నుంచి ఐదేళ్లలో రూ.4,797 కోట్ల వ్యయంతో భూ శాస్త్రాలకు సంబంధించి కొనసాగుతున్న ఐదు ఉప-పథకాలతో కూడిన ”పృధ్వీ విజ్ఞాన్”కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం ఉప-పథకాలను కలుపుతూ భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ఆమోదించింది. అయోధ్య విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించి దానికి ”మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్” అని పేరు పెట్టే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొదటి దశలో విమానాశ్రయం ఏటా 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించగలరు. రెండవ దశ తరువాత మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. రూ.1,450 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో అత్యాధునిక విమానాశ్రయం మొదటి దశ అభివృద్ధి చేయబడింది. విమానాశ్రయం టెర్మినల్ భవనం 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. టెర్మినల్ భవనం ముఖభాగం అయోధ్యలో రాబోయే శ్రీరామ మందిరం ఆలయ నిర్మాణాన్ని వర్ణిస్తుంది.