- ఇర్ఫాన్ హబీబ్
ఈ ఏడాది మార్క్స్ మహనీయుని ద్విశత జయంతి. దానిని ఘనంగా జరపడ మంటే ఆయన బోధనలను మననం చేసుకో వడం, వాటిని ఆచరించడం. ఆయన బోధన లలో అత్యంత కీలకమయినది. చరిత్ర గురించి ఆయన అవగాహన. భారతదేశంలో నివసిస్తున్న మనకు, ఇతర దేశస్థులకు కూడా ఇది అత్యంత ప్రధానమైనది. ఎందుకంటే మానవజాతి గత అనుభవాల నుండి మనం ఏ గుణపాఠాలు తీసుకోవాలి, మానవ సమాజ గమనం తీరు తెన్నులను అర్థం చేసుకుంటూ భవిష్యత్తును ఎలా తీర్చి దిద్దుకోవాలి అనే మార్గదర్శకత్వాన్ని కూడా ఇది అందిస్తుంది.
మార్క్స్ ధృవీకరించిన అంశాలనే ఈనాటి ప్రముఖ ఆధునిక చరిత్రకారులు తరచుగా ధ్రువీకరిస్తున్నారు. ఇ హెచ్ కార్ లాగానే మార్క్స్ కూడా ''చారిత్రక వాస్తవాలను'' మనం అర్థం చేసుకోగలమని, అన్వేషణ, ఎంపిక, అటువంటి వాస్తవాలను వివరించటం ద్వారా తమ జ్ఞానాన్ని మరింత పరిపుష్టం చేసుకోగలరని చెప్పారు. మార్క్స్ కూడా మార్క్బ్లాక్ లాగా చరిత్ర అధ్య యనం ద్వారా దానిని ఉపయోగించుకో గలమని, అది తనకుతానుగా ప్రత్యేకమైనది కాదని, అది మనజ్ఞానంలో ఒకభాగం మాత్రమే నని చెప్పారు. మన భవిష్యత్ను తీర్చిదిద్దు కోవటానికి అది ఉపయోగపడుతుందని చెప్పారు. ''తాత్వికులు ప్రపంచాన్ని పరి పరి విధాలుగా వ్యాఖ్యానించారు. అయితే అసలు విషయం దానిని మార్చడం ఎలా అన్నదే (థీసిస్ ఆన్ ఫ్యుర్బ)'' అని 1845 లోనే మార్క్స్ చెప్పారు. మనం గతకాలపు పరిస్థితులను, అనుభవాలను నమోదు చేసిన చరిత్రను ఈనాటి మన కార్యాచరణను రూపొందించుకోవడానికి సహాయపడేందుకు అధ్యయనం చేస్తాం.
చరిత్రను తెలుసుకునేందుకు రెండురకాల దృక్పథాలు ఉన్నాయి. ఒకటి రాజకీయ, సాంస్కృ తిక సంఘటనలను ఇదివరకటి రచయితలు వర్ణించిన విధంగానే నమోదు చేసే పద్ధతి. గతం లో జరిగిన సంఘటనలను మన పూర్వీకుల దృష్టినుంచే చూడడం, అంటే ఆనాటి భిన్నమైన రాజకీయ, సామాజిక పరిస్థితులను పరిగణన లోకి తీసుకోకపోవడం. నిజానికి ఆనాటి పరిస్థి తుల ఉపయోగం మనకిప్పుడు పరిమితంగానే ఉంటుంది. అందువలననే ఈనాడు చరిత్ర ఆధ్యయన కృషిలో ఉన్నవారు వారి వద్ద ఉన్న చారిత్రక ఆధారాలకు 'గుణాత్మక విశ్లేషణలు' చేయడాన్ని అంగీకరించడం లేదు. మార్క్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు ''ఒక వ్యక్తి తనను గురించి తనేమనుకుంటున్నాడో అన్న దానిని బట్టి అతనిని ఎలాగయితే అంచనా వేయ మో అలాగే మారుతున్న కాలానికి సంబంధించి ఆనాటి చైతన్యంతో అంచనాకు రాలేము''. (ది క్రిటిక్ అఫ్ పొలిటికల్ ఎకానమీకి ముందు మాట).
రెండో పద్ధతి: సాధారణ సార్వజనీన మానవ చరిత్ర సూత్రాలను ప్రత్యేక కాలానికి, లేదా ప్రత్యేక దేశ, ప్రాంత చరిత్రకు జోడించడం. సార్వజనీన, ప్రత్యేక చరిత్రలను నిరంతరం జోడించే అవకాశం పాతతరం చరిత్ర పరిశోధకులకు లేదు. పూర్వకాలంలో చరిత్ర పరిశోధనలో విశేష కృషి చేసిన హెరొడోటస్ (5వ శతాబ్దం బిసి,గ్రీస్)
అత్యున్నత మేధావి ఐన ఇబన్ ఖల్డుం (14వ శతాబ్దం, ఉత్తర ఆఫ్రికా) కాలగమనంతో చరిత్ర విస్తరిస్తుంటుందని చెప్పారు. అలాగే సాధారణ అన్వయింపును జోడిస్తే సార్వజనీన అనుభవాల వన్నె పెరుగుతుంటుంది. ఇది ప్రత్యేకకాలంలోని ప్రతి దేశచరిత్రను అర్థం చేసు కోవడానికి నిరంతరం ఉపయోగపడు తుంటుంది. మార్క్స్ దృష్టిలో చరిత్ర సార్వజనీన అనుభవాల సారం. గతకాలం గురించిన శాస్త్రీయ ఆధునిక పరిశోధనలతో ఆధునిక తాత్వికతను, ముఖ్యంగా హెగెల్ లాంటి వారు జోడించగా, మార్క్స్ చరిత్ర పూర్తిగా వాస్తవ సమాచారం ఆధారంగానే గ్రహించారు. అదే సమయంలో ఒక ఏకీకృత చట్రంలో ఇమిడ్చి చరిత్రనంతటిని అధ్యయనం చేసేందుకు వీలు కల్పించాడు.
తమ భౌతిక అవసరాలను తీర్చుకోవ డానికి ప్రయత్నించడమే మానవ సమూహాల మధ్య సామాజిక సంబంధాలు ఏర్పడటానికి మౌలిక ప్రాతిపదిక అని మార్క్స్ భావిస్తారు. ఈ అవసరాలను తీర్చుకోవటం ఉత్పత్తి ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. స్త్రీ, పురుషులు సమూహాలుగా పాల్గనటం ద్వారానే ఉత్పత్తి సాధ్యపడుతుంది. 'భౌతిక జీవనావసరాలను ఉత్పత్తి చేసే పరిస్థితులే సామాజిక, రాజకీయ, వైజ్ఞానిక జీవన క్రమాన్ని నిర్ణయిస్తాయి'' అన్న (రాజకీయ అర్థశాస్త్ర విమర్శకు ముందుమాట). భావన మార్క్స్ ఆలోచనలకు మూలం. అందువలననే ఆయన చరిత్రను పరిశీలించిన విధానాన్ని చారిత్రక భౌతికవాదం అని అంటా రు. ఇందుకు భిన్నంగా భావవాద తత్వవేత్తల దృష్టిలో చరిత్ర ముకుళించిన ఆలోచనలు విప్పారడం, లేదా దైవాదేశాలు గలది లేదా ఇంకా పామరుల స్థాయిలో చెప్పాలంటే జాతి లేదా మతం పేరుతో ఘనత వహించిన వ్యక్తు లు రూపొందించినది మాత్రమేనని భావిస్తారు.
ఉత్పత్తి చేయకుండా కేవలం ఆహారాన్ని సేకరించిన ఆదిమ మానవుని గురించి మార్క్స్ తర్వాతి కాలంలో తెలుసుకున్నాడు (వేట, చేపలు పట్టడం, పండ్లు సేకరించడం తదితరాలుగా). మానవులు వర్గ విభజన లేని పురాతన సమా జాలలో నివసించారు. అయితే వ్యవసాయం అభివృద్ధి చేందిన నాటి నుండి మానవుడు తన మౌలిక అవసరాలకంటే 'అదనం' గా ఉత్పత్తి చేయటం మొదలు పెట్టాడు. దానితో సమాజం వర్గాలుగా విడిపోయింది. ఉత్పత్తి చేసేవారు ఒక వర్గంగానూ చేసిన ఉత్పత్తిని వారివద్ద నుండి బలవంతంగా లాక్కునేవారు మరో వర్గంగానూ విభజించబడ్డారు.రెండో వర్గమైన దోపిడీదారులు వారు బలప్రయోగం ద్వారా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుని రాజ్యాలను స్థాపించారు. ప్రైవేటు ఆస్తులను కాపాడే సంస్థలను ఏర్పరచు కున్నారు. మనుషులలో కొందరు వ్యక్తులు మరికొందరు వ్యక్తుల వ్యక్తిగత ఆస్థిగా, బానిసలు గా మారారు. భూమి విషయంలో కూడా ఇదే జరిగింది. ఆనాటి నుండి భౌతిక అవసరాలను తీర్చుకోవడం కోసం శ్రామికుల, ముఖ్యంగా కార్మికుల, రైతుల మిగులును స్వాధీనం చేసుకో వటం, దానిని తామవద్ద ఉంచుకొని తామే అనుభవించటం కోసం జరిగిన పోరాటాలతో మిళితమయింది. మానవ సమాజం దోపిడీ సమాజంగా మారిపోయింది. అందువలననే ''ఇప్పటివరకు ఉన్న చరిత్రంతా వర్గ పోరాటాల చరిత్రే'' అని కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్ ఏంగిల్స్లు చెప్పారు.
అదనపు ఉత్పత్తి చేసే సమాజాలన్నిటి చరిత్రలోను ఉన్న ఒక సాధారణాంశం వర్గ పోరాటాలయితే ఆ సమాజాలన్నిటిలో ఉన్న వర్గాలు నిరంతరం మార్పు చెందుతూ ఉండడం కూడా సాధారణమయిన అంశమే. ఏదయినా మార్పు చెందనిది ఉన్నదంటే అది మార్పు మాత్రమే అని మార్క్స్ అభిప్రాయం. అందు వలన సంచిత మార్పులు సమూల మార్పులకు దారితీశాయి. ఫలితంగా మానవ చరిత్ర వేరు వేరు 'సమాజాలఏర్పాటుగా' కనిపిస్తుంది. ప్రతి సామాజిక వ్యవస్థ ఆ సమాజంలో జరుగుతున్న ఉత్పత్తి విధానంపైనా, 'ఉత్పత్తి దారుల' నుండి అదనపు ఉత్పత్తిని ఏ విధంగా కాజేస్తున్నారన్న దానిపైనా ఆధారపడి ఉంటుంది. అంటే ఆనాటి పరికరాలు, అప్పటికున్న సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. సామాజిక వ్యవస్థకు పునాది 'ఉత్పత్తి సంబంధాలు' అని, ఆనాటికి ఉపయోగంలో ఉన్న ఉత్పత్తి సాధనాలపై ఇవి ఆధారపడి ఉంటాయని చెప్పాడు. యూరప్ను పరిశీలించిన మార్క్స్ ప్రాచీన వర్గ సమాజాన్ని బానిసవ్యవస్థగాను, ఆ తరువాత కట్టుబానిసలపై ఆధారపడిన సమాజాన్ని భూస్వామ్య వ్యవస్థగాను పేర్కొన్నాడు. చివరిగా పారిశ్రామిక విధానంపై ఆధారపడిన జీతగాళ్లయిన కార్మికులతో కూడిన సమాజాన్ని పెట్టుబడిదారి వ్యవస్థగా పేర్కొన్నాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ యూరప్లో ప్రారంభమయినా ప్రపంచం మొత్తం వ్యాపించింది. దోపిడీ సమాజపు చివరి దశ ఇది. దీనిస్థానంలోనే మనం దోపిడీ రహిత సోషలిస్టు సమాజాన్ని నిర్మించాలి.
పైన మనం చెప్పుకున్న వ్యవస్థలలో మార్పులు రావడానికి కారణం ఏమిటి? ఇవి ప్రకృతి సిద్ధంగా వచ్చిన మార్పులు కాదు. వర్గ పోరాటాలే ఇందుకు కారణం. ఎక్కడయితే మానవ కార్యకలాపాలు ఉంటాయో అక్కడ 'చైతన్యవంతమయిన' ఆలోచన ఉంటుంది. అదే అన్ని తక్షణ చర్యలకు ప్రేరణ అవుతుంది. ఈ ప్రేరణ అన్నది భౌతిక పరిస్థితులమీద ఆధారపడి ఉంటుందని మార్క్స్ అన్నట్టు ఒక అపప్రద ఉంది. ''మానవుల చైతన్యం వారి మనుగడను నిర్థారించదు. వారి సామాజిక మనుగడ చైతన్యాన్ని నిర్ధారిస్తుంది (రాజకీయ అర్థశాస్త్ర విమర్శకు ముందుమాట)'' అని మార్క్స్ అనడాన్ని తప్పుగా వొక్కాణించడం వలన ఈ అపప్రద ఏర్పడింది. వాస్తవంగా ఆ తరువాత 'నిర్ధారించడం' అన్న పదాన్ని గురించి మార్క్స్ వివరించారు''. మానవజాతి తాను పరిష్కరించ గలిగిన లక్ష్యాలనే ఎంచుకుంటుంది. ఇంకా నిశితంగా పరిశీలిస్తే, ఆ సమస్య పరిష్కరించ టానికి తగిన భౌతిక పరిస్థితులు అప్పటికే ఏర్పడినపుడే లేదా కనీసం ఏర్పడుతున్నప్పుడే ఆ సమస్య ఉనికిలోకి వస్తుంది.
మరో మాటల్లో చెప్పాలంటే ఆనాటికున్న భౌతిక పరిస్థితులకు లోబడి చైతన్యం ఉంటుంది. దీనికి తోడు మరికొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. పాత సమాజాలు తమను తాము తార్కికంగా అర్థం చేసుకోవటంలో విఫలమయ్యాయి. అందువలన ఒక వర్గానికి చెందిన వ్యక్తి, ఉదాహరణకు రైతులు తాము ఏ వర్గానికి చెందుతారో తెలుసుకోవడంలో విఫలమై ఉండవచ్చు. అటువంటి తార్కిక ఆలో చనలు కలుగకుండా తరచుగా మతం అవరో ధాలు కల్పించింది. అందువలననే మార్క్స్ 'చాలాముందుగానే మతాన్ని ''ప్రజల పాలిటి నల్లమందు'' అని అన్నారు. అలాగే తగిన భౌతిక పరిస్థితులు ఉన్నట్లయితే మానవులు అహేతుక కార్యకలాపాలకు పూనుకున్నప్పటికీ అవికూడా సామాజిక వ్యవస్థపై ప్రభావం కలిగించటానికి దారితీస్తాయి. భారతదేశంలోని వర్ణవ్యవస్థను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అది నిరంతర మత సమ్మతితో నిర్మించబడింది. మార్క్స్ ఈ విభజనను గర్హించారు.''ఇవి భారతదేశ అభివృద్ధికి, భారతదేశ శక్తికిఖచ్చితమైన అడ్డంకులు'' అని అన్నారు. అలాగే ఆధునిక యుగంలో ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీ ఎదుగుదల ''పెట్టుబడి పుట్టుకకు ముఖ్య కారణం'' (పెట్టుబడి భాగం-1)అనిమార్క్స్ గుర్తించారు. అందువలన ''మత ప్రపంచం అసలు ప్రపంచ ప్రతిబింబం''(మార్క్స్ ). మతం అసలైన ప్రపంచాన్ని
తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అందువలన మార్క్స్ ఆలోచనా విధానా నికి కేంద్రబిందువు, పెట్టుబడిదారీ వ్యవస్థలో నిర్మించబడిన చైతన్యం నుండి మానవులను విముక్తులను చేయడం. ''పాతకాలపు దురభి మానాలు, అభిప్రాయాలతో స్థిరీకరించబడి ఘనీభవించబడిన అన్ని బంధాలు తెంచుకో బడతాయి. కొత్తగా ఏర్పడ్డవి స్థిరపడడానికి ముందే పాతబడి పోతాయి. ఘనీభవించిన దంతా కరిగిపోతుంది. పవిత్రమైనదంతా అపవి త్రమవుతుంది. చివరికి మనిషి తన వివేకవంత మయిన బుద్ధితో జీవిత వాస్తవ పరిస్థితులను, తోటి మానవులతో సంబంధాలను అర్థం చేసుకోవలసి వస్తుంది'' (మార్క్స్, ఏంగిల్స్-కమ్యూనిస్ట్ ప్రణాళిక).
వర్గ దోపిడీని ద్వంసం చేసి సోషలిజాన్ని స్థాపించడానికి భౌతికపరిస్థితులు-యాంత్రీ కరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థికాభి వృద్ధి స్థాయి -ఏమేరకు అభివృద్ధి చెందుతాయో ఆ మేరకే మానవ చైతన్యం అభివృద్ధి చెందు తుంది. మార్క్సిజం శాస్త్రీయ సోషలిస్టు చైతన్యం ఎదుగుదలకు పరాకాష్ట. శ్రామిక వర్గం (పెట్టుబడి దారీ వ్యవస్థలో రూపొందించబడి నది) తన పోరాటాల ద్వారా నూతన వ్యవస్థ అవిర్భాÛవాన్ని సూచిస్తుంది. అయితే ఉన్న భౌతిక పరిస్థితులు తన చైతన్య స్థాయికి కారణ మని కార్మికవర్గం సృహ కలిగి ఉండాలి. గుడ్డి గానో సద్యోజనితంగానో విప్లవం రాదు.
అందుకనే మార్క్స్ను ఒక 'నియతివాది '(డెటెర్మినిస్ట్) అనలేము. అదేసమయంలో భావాల పాత్రను నొక్కి చెప్పడమే కాక అత్యంత కఠినమయిన తాత్విక, ఆర్థిక సిద్ధాంతాన్ని వివరించడానికి ఎంతో శ్రమించారు. ఆయన మనకు ఒక అద్భుతమయిన విప్లవ సిద్ధాంతాన్ని మాత్రమే వారసత్వంగా ఇచ్చివెళ్ళలేదు. దాంతో పాటు ఆయన అడుగుజాడలలో నడిచే పద్ధతు లను, ఆ ప్రాతిపదికనే మన గత చరిత్రను, వర్తమాన పరిస్థితులను అంతే కఠినమయిన విశ్లేషణ చేసి, దూరదృష్టితో మన ''విప్లవ ఆచరణను'' అభివృద్ధి చేసే పద్ధతులను కూడా ఇచ్చివెళ్లారు. ప్రతి చైతన్య పూరితమైన వ్యక్తి ఒక బాధ్యతను నిర్వర్తించాలి. మార్క్సిజంలోని విప్లవసారాన్ని అవగాహన చేసుకోవడమే కాదు. ఆ భావాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. ఈ బాధ్యతను నిర్వరించగలిగితే వారు చరిత్రను అవగాహన చేసుకోవడమే కాదు, చరిత్ర సృష్టిస్తారు కూడా.
(అనువాదం: కె ఉషారాణి)
చరిత్ర గురించి మార్క్స్ భావన
