- చంద్రబాబు, నారాయణపై సిఐడి ఛార్జిషీట్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అమరావతి నిర్మాణంలో అసైన్డ్ భూముల కుంభకోణంలో టిడిపి ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకూ రూ.4,400 కోట్ల స్కామ్ చేసినట్లు ఎపి సిఐడి పేర్కొంది. ఈ మేరకు సోమవారం విజయవాడలోని ఎసిబి కోర్టులో సిఐడి ఛార్జిషీట్ దాఖలు చేసింది. టిడిపి ప్రభుత్వం జిఓ నెంబరు 41 ద్వారా మందడం, వెలగపూడి. రాయపూడి, ఉద్దండరాయునిపాలెం తదితర గ్రామాల్లో 1,100 ఎకరాల మేర అసైన్డ్ భూములను సమీకరించినట్లు పేర్కొంది. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మున్సిపల్శాఖ మంత్రి పి నారాయణ, తుళ్లూరు మాజీ తహశీల్దారు అన్నె సుధీర్బాబు, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎమ్డి అంజనీకుమార్ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంది. అసైన్డ్ భూములను కాజేసేందుకు రికార్డులను కూడా ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపించింది. అమరావతి రాజధానిలో భారీ భూ దోపిడీ, క్యాపిటల్ సిటీ ప్లాన్తో భూ దోపిడీకి పాల్పడినట్లు సిఐడి పేర్కొంది. గతేడాది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును 52 రోజులపాటు జైలులో వుంచిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో కేసులో ఛార్జిషీట్ వేయడం పట్ల టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.