నమూనా చెక్కును అందజేస్తున్న జెసి నవీన్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
జగనన్న విద్యా దీవెన కింద జిల్లాలో 42,386 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.27.45 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. నాలుగో విడత జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని గుర్తించిన ప్రభుత్వం బిడ్డ పుట్టిన దగ్గర నుంచి విదేశీ విద్య వరకు పలు పథకాలను అందజేస్తోందన్నారు. జిల్లాలో ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే 42,386 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమ చేసినట్లు చెప్పారు. అనంతరం నమూనా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, విద్యార్థులు పాల్గొన్నారు.