చిక్కమంగళూరు : ఫోర్ ట్వంటీలు (మోసానికి పాల్పడినవారు) 400 సీట్లు గెలుస్తామంటున్నారంటూ ప్రముఖ సినీ నటుడు ప్రకాష్రాజ్ బిజెపిపై మండిపడ్డారు. ఇవి అహంకారంతో కూడిన వ్యాఖ్యలని అన్నారు. కర్ణాటకలోని చిక్కమంగళూరులో ఆదివారం మీడియాతో ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. ప్రధాని మోడీ, బిజెపి నేతలు తరచూ బిజెపి 370, ఎన్డిఎ 400 సీట్లు గెలుస్తుందంటూ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో వారి పేర్లు ప్రస్తావించకుండానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని 420లు చెబుతున్నారు. అలా చెప్పే రాజకీయ పార్టీ కాంగ్రెస్ లేదా ఇతర పార్టీ ఏదైనా కావొచ్చు. అలా చెప్పడం అహంకారమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ 400.. అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం లేదు. ప్రజలు ఓటు వేస్తేనే సదరు అభ్యర్థి గెలుస్తారు. అలాంటిది ఓ రాజకీయ పార్టీ, ఆ పార్టీ నేత తమ పార్టీ ఇన్ని సీట్లు గెలుస్తామని ఎలా చెబుతుంది. దీనిని ముమ్మాటికీ అహంకారం అనే అంటారు’ అని ప్రకాష్రాజ్ అన్నారు.