హైదరాబాద్ : కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ హైదరాబాద్ లో యువతీ యువకులు ఫుల్గా ఎంజారు చేశారు. వేడుకలలో మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వచ్చిన మందుబాబులను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఆదివారం ఒక్కరోజే 2,700లకు పైగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1,500 మంది మందుబాబులు పట్టుబడగా.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,241 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. సిటీలో ఎక్కువగా మియాపూర్లో 253 కేసులు నమోదయ్యాయి. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డ వారిలో 382 మంది 18 నుంచి 25 ఏళ్ల లోపు వారు కాగా, 26 సంవత్సరాల నుంచి 35 వయసున్న వారు 536 మంది ఉన్నారని వివరించారు. సీజ్ చేసిన వాహనాలలో 938 టూ వీలర్స్, 21 త్రీ వీలర్స్, 275 ఫోర్ వీలర్స్, 7 హెవీ వెహికల్స్ ఉన్నాయి.