ప్రజాశక్తి-యంత్రాంగం తమ డిమాండ్లు నెరవేర్చాలని అంగన్వాడీలు జిల్లావ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 38వ రోజుకు చేరింది. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద 24 గంటల నిరాహార దీక్షను ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.బేబీరాణి ప్రారంభించారు. దీక్షలనుద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.సుందరబాబు మాట్లాడారు. 38 రోజులుగా, పండగల్లో సైతం అంగన్వాడీలను పస్తులు ఉంచారన్నారు. నాలుగున్నరేళ్లలో నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీలు, పన్నుల భారాలు ఎన్నో రెట్లు పెంచిన ప్రభుత్వం వేతనాలు పెంపు విషయంలో మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, జిల్లా కమిటీ సభ్యుడు బి.పవన్, అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్ఎస్.మూర్తి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్.రాజా, నాయకులు సుబ్బలక్ష్మి, జె.సునీత, కె.శారద అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు పాల్గొన్నారు. చాగల్లు సమ్మె శిబిరంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు కె.లక్ష్మి మాట్లాడారు. గోకవరం అంగన్వాడీలు వర్కర్స్, హెల్పర్స్ సమ్మె శిబిరంలో పాల్గొన్నారు. పెరవలి స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని టిడిపి మాజీ ఎంఎల్ఎ బూరుగుపల్లి శేషారావు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు అతికాల రామకృష్ణమ్మ, జనసేన మండల అధ్యక్షుడు పిప్పర రవికుమార్, టిడిపి, జనసేన నాయకులు కె.కృష్ణవేణి, బి.నాగవేణి, సెక్టార్ లీడర్లు సిహెచ్.విశాలి, వి.నిర్మల, కన్యాకుమారి, ఎస్.రాణి, ఎన్.శాంత కుమారి, బి.రామలక్ష్మి, పి.దుర్గా లక్ష్మి పాల్గొన్నారు. తాళ్లపూడి సమ్మె శిబిరంలో దీక్షలను కొనసాగించారు. ఉండ్రాజవరం సమ్మె గురువారం 38వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మె శిబిరం వద్ద అంగన్వాడీలు మహిళలకున్న శక్తి, సామర్థ్యాలను నిరూపిస్తూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.రంగనాయకమ్మ, వి.లక్ష్మి, కెఎంఎస్.ప్రసన్న కుమారి, రత్నకుమారి, సిహెచ్.జ్యోతి, మహాలక్ష్మి పాల్గొన్నారు.