విలేకరులతో మాట్లాడుతున్న డీఎస్పీ గంగయ్య
తాడిపత్రి : ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.22 లక్షలను సీజ్ చేసినట్లు డీఎస్పీ గంగయ్య తెలిపారు. శనివారం పట్టణ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ గౌస్బాషా, తాడిపత్రి అసెంబ్లీ ఎన్నికల ఎస్టి టీం ఇన్ఛార్జి రామాంజనేయరెడ్డిలతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టణంలోని చుక్కలూరు రోడ్డులో ఉన్న బ్రిడ్జి వద్ద స్థానిక కృష్ణాపురం రెండవ రోడ్డుకు చెందిన షేక్సాదిక్, షేక్ మునీర్బాషా మోటారు సైకిల్లో అనుమానంగా వెళ్తుండగా అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వీరు ద్విచక్ర వాహనంలో రూ.22 లక్షలు తరలిస్తుండగా గమనించారన్నారు. అయితే నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ చూపకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. అంతేగాకుండా వీరిపై విచారించగా ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారు బెంగుళూరు, తదితర ప్రాంతాల్లో బంగారం కొనుగోలు చేసి తాడిపత్రిలో అధిక ధరకు విక్రయిస్తుంటారని తేలిందన్నారు. కాగా ప్రస్తుతం పట్టుబడిన డబ్బుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఎన్నికల ఆర్ఓ ద్వారా ఐటి విభాగానికి అప్పగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ గౌస్బాషా, తదితరులు పాల్గొన్నారు.