21 నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్
మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సంఘం డిసెంబర్ 21 నుంచి తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం నగరంలోని గుత్తి రోడ్డు ఐదు లైట్లు సర్కిల్లో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించిందన్నారు. ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు నగర ప్రజలు సహకరించాలని కోరారు.రాయదుర్గం : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు మున్సిపల్ కార్మిక యూనియన్ నాయకులు తిప్పేస్వామి, రాము, మల్లేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లికార్జున, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బంగి శివ తెలిపారు. ఈమేరకు మంగళవారం స్థానిక మున్సిపల్ ఛైర్పర్సన్ ఛాంబర్లో ఛైర్పర్సన్ పొరాళు శిల్పకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ డిమాండ్లు పరిష్కరించాలని దీర్ఘకాలంగా అనేక విడతలుగా అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ఇంతవరకూ సమస్యలు పరిష్కరించలేదన్నారు. ఇందుకు నిరసనగా 21వ తేదీ నుంచి సమ్మెలో వెళుతున్నట్లు తెలిపారు.