* నిర్మాణ గడువును పొడగిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
* వచ్చే జూన్ 30వ తేదీ లోపుగా పూర్తి చేస్తాం : ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి
విజయనగరం : ఇప్పటిదాకా అసంపూర్తిగా నిలిచిపోయిన పూర్ణపాడు – లాబేసు వంతెన నిర్మాణంలో కదలిక వచ్చింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి చొరవతో ఈ వంతెన నిర్మాణానికి సంబంధించిన ఈఓఏటి గడువును రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జూన్ 30 వతేదీ వరకూ పొడగిస్తూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఇప్పట్లో పూర్తవదనుకున్న పూర్ణపాడు – లాబేసు వంతెన నిర్మాణం మరో ఏడు నెలల్లో పూర్తి కావడానికి మార్గం సుగమమైయింది. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలోని కొమరాడ మండలంలో మొత్తం 31 పంచాయితీలు ఉండగా వాటిలో 22 పంచాయితీలు నాగావళి నదికి ఒకవైపున ఉండగా, మరో 9 పంచాయతీలు నదికి మరోవైపున ఉన్నాయి. అయితే నాగావళి నదిపై వంతెన లేనికారణంగా 9 పంచాయతీలకు చెందిన ప్రజలు మండల కేంద్రమైన కొమరాడ కు రావాలన్నా, 22 పంచాయతీలకు చెందిన గ్రామస్తులు నియోజకవర్గకేంద్రమైన కురుపాం కు చేరుకోవాలన్నా చుట్టూతిరిగి రావాల్సి ఉంటుంది. పార్వతీపురం మీదుగా చుట్టూ తిరిగి రావడానికి సుమారు 60 కిలోమీటర్ల దాకా ప్రజలు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో అయితే నాగావళి నదిపై పూర్ణపాడు-లాబేసు గ్రామాల మధ్యన వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. మొదట నిర్ణయించిన గడువు ప్రకారంగా 2017 మే 24వ తేదీలోపుగా ఈ వంతెన నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా అనుకున్న సమయానికి వంతెన నిర్మాణం పలు కారణాలతో పూర్తి కాలేదు. ఆ తర్వాత వంతెన నిర్మాణ గడువు ( ఎక్స్ టెన్షన్ ఆఫ్ అగ్రిమెంట్ టైం- ఈఓఏటి) ని గత 2018 జూలై నాటికి పొడిగించారు. అయితే ఈ వంతెన నిర్మాణాన్ని గత ప్రభుత్వం పనుల్లో జాప్యం కారణంగా పెరిగిన అంచనా వ్యయాన్ని గురించి పట్టించుకోకపోవడంతో పూర్ణపాడు – లాబేసు వంతెన నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ పరిస్థితుల్లోనే ఈనెల 5వ తేదీన డిప్యుటీ సిఎం పుష్ప శ్రీవాణి ఆగిపోయిన ఈ వంతెనను సందర్శించి, జరుగుతున్న ఆలస్యానికి కారణాలేమిటని ఆరా తీసారు. నిర్మాణంలో జరిగిన ఆలస్యం కారణంగా రూ. 10 కోట్ల అంచనాతో మొదలైన ఈ వంతెన నిర్మాణ వ్యయం రూ. 14 కోట్లకు చేరిందని, దీనికి అవసరమైన అదనపు నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అలాగే వంతెన నిర్మాణ ఒప్పంద గడువు (ఈఓఏటి)ను కూడా పొడిగించాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని పంచాయితీరాజ్ అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. నిలిపి వేసిన వంతెన పనులను మళ్లీ ప్రారంభించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వంతెన నిర్మాణం వచ్చే ఏడాది జూన్ మాసం లోపుగా పూర్తిచేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆమె ఆదేశించారు. ఈమేరకు పూర్ణపాడు – లాబేసు వంతెన ఈఓఏటి గడువును 2020 జూన్ 30 వతేదీ వరకూ పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గోపాల క్రిష్ణ ద్వివేదీ గురువారం జీవో ఆర్టీ నెంబర్ 711 జారీ చేశారు. దీంతో ఇప్పటి దాకా నిలిచిపోయిన ఈ వంతెన నిర్మాణం మళ్లీ మొదలుకానుంది.
