హైదరాబాద్ : తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ.. వైసిపి నేత లక్ష్మీ పార్వతి డిజిపి కి ఫిర్యాదు చేశారు. సోమవారం హైదరాబాద్లోని డిజిపి కార్యాలయానికి వెళ్లిన లక్ష్మీ పార్వతి డిజిపి మహేందర్ రెడ్డిని కలిసి కోటి అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. అనంతరం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ... తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా కోటి అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో అసత్యాన్ని ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న తనను అగౌరవపరుస్తూ విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ నెల (ఏప్రిల్) 4 వ తేదీన కోటి అనే వ్యక్తి తప్పుడు ఆరోపణలు చేస్తూ.. టివి ఛానెల్స్, సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని కించపరిచాడని లక్ష్మీ పార్వతి ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. కోటి అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిజిపి కి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తున్న కోటి అనే వ్యక్తిని బిడ్డలాగా భావించానన్నారు. తన పరువు, మర్యాదలు కాపాడాలని డిజిపి ని కోరానని తెలిపారు. దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని విజ్ఞప్తి చేశానన్నారు. డిజిపి వెంటనే స్పందించి హైదరాబాద్ కమిషనరుకు చెప్పారని.. హైదరాబాద్ సిపి ని కలుస్తానని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. లక్ష్మీ పార్వతి తనను లైంగికంగా వేధిస్తోంది అంటూ కోటి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనమైంది. ఆ తర్వాత లక్ష్మీ పార్వతి నుండి తనకు ప్రాణ హాని ఉందని కోటి ఆరోపించాడు.
డిజిపి కి వైసిపి నేత లక్ష్మీ పార్వతి ఫిర్యాదు
