ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై శ్రీనివాసరెడ్డి, సత్య, షకలక శంకర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు'. ఈ చిత్రం ద్వారా కమెడియన్, నటుడు వై.శ్రీనివాస్ రెడ్డి దర్శక నిర్మాతగా మారుతున్నారు. ఈనెల 6న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా బ్యానర్ లోగోను అనిల్ రావిపూడి విడుదల చేశారు. టైటిల్ యానిమేషన్ను ఎస్.ఎస్.థమన్ ఆవిష్కరించారు.
దర్శక నిర్మాత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 'ముందు ఈ సినిమాకు నిర్మాతగా మాత్రమే చేద్దామని అనుకున్నాను. కానీ వేరే డైరెక్టర్ను పెట్టినా ఆయన వెనక ఏమైందంటూ నేను నిలబడాల్సి వస్తుంది. దీంతో నేనే డైరెక్ట్ చేశాను. దర్శకుడు కావాలనే కోరిక అలా తీరింది. సినిమా చూసిన దిల్రాజు, శిరీష్, సాయి సహా కొంతమంది చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు. అదంతా మా సినిమాకు ఎంతో హెల్ప్ అయింది. పూర్తిస్థాయి హాస్యభరిత చిత్రం. 1గంట 53 నిమిషాలున్న మా సినిమాలో గంటన్నర సేపు పడి పడి నవ్వుతారు. ఆ విషయంలో నాది గ్యారెంటీ. నో యాక్షన్, నో సెంటిమెంట్ .. ఓన్లీ కామెడీ' అని అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ 'శ్రీనివాస్రెడ్డి మా సినిమా సెట్లో కూడా ఆర్టిస్ట్ కంటే అసిస్టెంట్ డైరెక్టర్గా కష్టపడుతుంటాడు. తను డైరెక్షన్తో పాటు ఈ సినిమాకు ప్రొడక్షన్ కూడా చేస్తున్నానని చెప్పగానే కాస్త భయపడ్డాను. రిస్క్ ఏమో! అని అన్నాను. తన ప్లానింగ్తో సినిమాను పూర్తి చేశాడు. నేను సినిమాను చూశాను. నాకు సన్నివేశాలు బాగా నచ్చాయి. ప్రేక్షకులు కూడా శ్రీనివాస్రెడ్డి తొలి ప్రయత్నాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు.
నిర్మాత పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ 'ఈ సినిమా విషయంలో శ్రీనివాసరెడ్డి కేవలం భాగ్యనగర వీధుల్లోనే కాదు. రెండు రాష్ట్రాల్లోనూ గమ్మత్తు చేస్తారనడంలో సందేహం లేదు. గట్టిగా నవ్విస్తున్నారు. చాలా క్లారిటీగా ఈ సినిమాను తెరకెక్కించార'ని తెలిపారు.
పడిపడి నవ్వుకుంటారు
